మలుగు జిల్లాలో సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి లక్షల్లో డబ్బులు జమయ్యాయి. ఆ డబ్బు ఎవరు పంపారో తెలియదు కాని ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కొందరి అకౌంట్లలోకి రూ. 2 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డబ్బులు జమయ్యాయి. ఫోన్కు వచ్చిన మెసేజ్ చూసి సామాన్యులు షాక్కు గురయ్యారు.
ఇటీవల విడుదలైన భీమదేవరపల్లి బ్రాంచి సినిమా చూశారా? ఆ సినిమాలో కేంద్ర ప్రభుత్వం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెబుతుంది. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ జంపన్న (అంజి వల్గుమాన్) అలానే చేస్తాడు. కొన్నిరోజులకు బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల జంపన్న తల్లి అకౌంట్లో రూ. 15 లక్షలు పడతాయి. వాటిని రకరకాల అవసరాలకు జంపన్న వాడుకుంటాడు.
ములుగు జిల్లాలోనూ ఆ సినిమాలో మాదిరిగా సామాన్యుల బ్యాంకు అకౌంట్లలోకి లక్షలకు లక్షలు డబ్బు పడింది. వాటిని వారు రకరకాల ఖర్చులకు వాడుకోవటంతో పాటు ఇతర ఖాతాలకు మళ్లించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓ వీధికి చెందిన సుమారు 50 మంది బ్యాంకు అకౌంట్లలో శనివారం (ఆగస్టు 26) డబ్బులు జమయ్యాయి. ఎవరు పంపారో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక అకౌంట్లలో డబ్బు పడిన ఖాతాదారులు తికమక పడ్డారు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.లక్ష రూ. 2 లక్షలు ఇలా డబ్బులు జమయ్యాయి.
ఖాతాలో డబ్బులు పడినట్లు సెల్ఫోన్కు మెసేజ్ రాగానే వారు షాక్కు గురయ్యారు. మాకు డబ్బులు పంపిందెవరబ్బా అని కాసేపు ఆలోచించారు. అనంతరం కొందరు ఆ డబ్బును ఫోన్పే, గూగుల్పే వంటి వివిధ మార్గాల ద్వారా ఇతర ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఏటూరునాగారంలోని ఎస్బీఐ, పీఎన్బీ, ఏపీజీవీబీ, కెనరా.. ఇలా పలు బ్యాంకుల ఖాతాదారులున్నారు. బ్యాంకర్లు పొరపాటున డబ్బులు వేశారేమో అనుకున్నా… శనివారం బ్యాంకులన్నీ బంద్ కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకుని ఇంటెలిజెన్స్ వర్గాలు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీశారు.