ఒకసారి దర్శకుడు వంశీ తన ఆఫీస్ లో కొత్త సినిమా పనుల్లో ఉండగా ఒక సీనియర్ నటుడు ఆ ఆఫీస్ కి వచ్చి తనకు ఒక వేషం ఇమ్మని అడిగారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ జానపద విలన్ రాజనాల. నిజానికి రాజనాల సినిమాల్లో మాత్రమే విలన్ తప్ప బయట ఆయనది జాలి గుండె.
తాను సినిమాల్లో సంపాదించిన డబ్బులన్నీ కష్టాల్లో ఉన్నవారిని ఆడుకోవడం కోసం ఖర్చు పెట్టేయడం, తర్వాత కాలానుగుణంగా అవకాశాలు తగ్గడం తో ఈ సినిమా ఆఫీస్ లో కొత్త సినిమా వర్క్ జరుగుతోంది అని ఆ సినిమా దర్సకుడు అయిన వంశీ గారిని అవకాశం అడగడం కోసం అక్కడకి వచ్చారు. పైగా ఆయన దగ్గర డబ్బులు లేక చాలా దూరం నుండి నడిచి వచ్చారు.
అయితే అప్పటికే అన్ని పాత్రలకి నటులు సెలెక్ట్ అయిపోవడం తో కాదు అనలేక సరే సర్ అని చెప్పి కిందకి తీసుకు వచ్చి ఒక టాక్సీ మాట్లాడి ఎక్కించి ఇంటికి పంపారు. తర్వాత వంశీ గారు చాలా సినిమాలు తీసినప్పటికీ సరైన పాత్ర దొరక్క రాజనాల గారికి వేషం ఇవ్వలేక పోయారు.
ఇది జరిగిన కొన్నేళ్ళ తర్వాత ఈటీవీ కోసం సుమన్ తమ ఉషాకిరణ్ మూవీస్ లో సినిమా తీసిన దర్శకులందరితో ఒక సీరియల్ తీయించి టెలికాస్ట్ చేస్తే బావుంటుంది అనిపించి వంశీ గారిని కూడా అడిగి “లేడి డిటెక్టివ్” అనే సీరియల్ తీయించారు.
ఆ సీరియల్ లో ఒక ఎపిసోడ్ లో స్మశానం లో హీరో నడుస్తూ ఉండగా హీరో మొహం మీద నుండి కెమెరా షిఫ్ట్ అయ్యి దూరంగా మండుతున్న మంట మీద కి జూమ్ అవ్వాలి. అలా ఆ షాట్ అయ్యాక వంశీ గారికి అది ఒక శవం మండుతున్న చితి అని అర్థం అయింది. కాటి కాపరిని పిలిచి ఆ శవం ఎవరిదీ అని అడిగిన ఆయనకి కాటి కాపరి చెప్పిన జవాబు విని షాక్ తగిలినట్లయింది.
కారణం ఆ శవం ఎవరిదో కాదు. రాజనాల గారిది.
అలా తను తీసిన సినిమాల్లో వేషం ఇవ్వలేక పోయినా తను తీసిన సీరియల్లో అనుకోకుండా ఇలా శవం వేషం ఇచ్చానని వంశీ గారు చాలా బాధపడ్డారుట.