ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు గానీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఆయన సభ్యుడిగా నియామకం మాత్రం మారడం లేదు. తమిళనాడుకు చెందిన ఈయన 2015 నుంచి నాలుగుసార్లు టీటీడీ సభ్యుడిగా నియమితులు కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు లేదా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండొచ్చు లేదా మరొకరు సీఎం కావచ్చు. ఏపీకి ముఖ్యమంత్రులు మారతారేమో గానీ.. టీటీడీ పాలక మండలి (TTD Trust Board)లో మాత్రం ఆయన సభ్యుడిగా ఉండాల్సిందే. ఇంతకూ ఆయన ఎవరు..? ఈ మాట ఎందుకు అంటున్నామో తెలుసుకోవాలని ఉందా..? చెన్నైకి చెందిన కృష్ణమూర్తి వైద్యనాథన్ వృత్తి రీత్యా ఆడిటర్. గత 8 ఏళ్లలో ఆరేళ్లు ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు కూడా జగన్ సర్కారు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించింది.
చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు 2015లో తొలిసారిగా కృష్ణమూర్తి వైద్యనాథన్కు టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం లభించింది. ఆ ఏడాది ఏప్రిల్ 27న ఆయన తొలిసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2018లో ఆయనకు బోర్డులో చోటు దక్కలేదు. కానీ 2019లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక.. అదే ఏడాది సెప్టెంబర్లో కృష్ణమూర్తి వైద్యనాథన్కు అవకాశం దక్కింది.
2021లో కృష్ణమూర్తి వైద్యనాథన్కు టీటీడీ బోర్డులో చోటు దక్కలేదు. కానీ బోర్డులో సభ్యురాలిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి కొద్ది రోజులకే రాజీనామా చేశారు. ఆమెను ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్మన్గా నియమించి.. ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల బాధ్యతను అప్పగించారు. దీంతో వేమిరెడ్డి ప్రశాంతి స్థానంలో కృష్ణమూర్తి వైద్యనాథన్కు అవకాశం కల్పించారు. కృష్ణమూర్తి కోసం ప్రశాంతితో రాజీనామా చేయించారనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి కూడా జగన్ సర్కారు కృష్ణమూర్తి వైద్యనాథన్ను టీటీడీ బోర్డులోకి తీసుకుంది. దీంతో ఏపీ సీఎంగా ఎవరున్నా.. ఈయన మాత్రం టీటీడీ పాలక మండలిలో ఉండటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు హయాంలో కేంద్రంలో ఓ మహిళా మంత్రి సిఫార్సుతో కృష్ణమూర్తి వైద్యనాథన్ను టీటీడీలోకి తీసుకున్నారని టాక్. కేంద్రంలోని ఓ కీలక మంత్రి సిఫార్సుతో టీటీడీలో సభ్యుడిగా ఆయనకు నాలుగోసారి అవకాశం వచ్చిందని ప్రచారం జరుగుతోంది.